ఎట్టకేలకు ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణా నుండి నలుగురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. వీరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్​కు గురువారం రిపోర్టు చేశారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో నలుగురు అధికారులు రాష్ట్రానికి వచ్చారు. వీరితో పాటూ మరో అధికారిణి ఎం. ప్రశాంతి కూడా నిన్ననే తెలంగాణలో రిలీవ్ అయినా ఇంకా ఏపిలో రిపోర్టు చెయ్యలేదు.

అయితే వీరికి చంద్రబాబు సర్కార్ ఏ బాద్యతలు ఇవ్వనుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా తన విధానాలతో పలువురిని ఆకట్టుకుంటున్న ఆమ్రపాలికి ఇచ్చే బాద్యతలపై ఆతృత కనపరుస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్​ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్​ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, సంతోశ్​ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్​కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్. శివశంకర్, సి. హరి కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్​ను తెలంగాణకు కేటాయించారు.

అయితే విభజన జరిగిన తీరుపై అబ్జెక్షన్​ చేస్తూ వీరందరూ 2014లో క్యాట్​ను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిలోని రంగనాథ్, సంతోశ్​ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ సెంట్రల్​ గవర్నమెంట్​ పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

డీవోపీటీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. రిలీవ్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్ని న్యాయస్థానం ఆదేశించింది. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌లు కోరారు.

రిలీవ్‌ చేసేందుకు 15 రోజులు గడువు ఇవ్వాలని డీవోపీటీని కోరినట్లు ఐఏఎస్‌లు వివరించారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని కోరింది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా అని ఐఏఎస్​లను హైకోర్టు అడిగింది. సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది.

Join WhatsApp Channel